Vijaya Lakshmi
Published on Aug 05 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 5న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో ఆగస్టు 4న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్ధు చేసింది. అదేవిధంగా, ఆగస్టు 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుప్పావడ సేవ పాటు పాటు ఆగస్టు 5 నుండి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
తిరుమల వెంకన్నను ప్రతిరోజూ కొన్ని వేలు, లక్షలమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఒక్కోసారి ఏవైనా పొరపాట్లు జరగవచ్చు. పురిటిమైల, మరణశౌచం ఇలా ఏవైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కేవలం భక్తుల వల్లనే కాకుండా ఒక్కోసారి ఆలయంలోని సిబ్బంది వల్లగాని, ఇతరుల వల్లగాని, తెలిసీ తెలియక, ఏ ఇతర కారణాల వలన గానీ పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వాటి కారణంగా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లి, దోషాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఆ దోష నివారణార్ధం ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు జరిపిస్తారు.
ఈ పవిత్రోత్సవాలు సాధారణ శకం 1464 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నట్టుగా ఆలయ శాసనాలు చెప్తున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు ఎంతోమంది భక్తులు ఎన్నెన్నో దానాలు కూడా చేసినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే 1562 తరువాత ఈ ఉత్సవాలు నిలిచిపోయాయి. మళ్ళీ 1962 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మూడురోజుల పాటు అత్యంత పవిత్రంగా వైదిక ఆచారాలతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావనమాసంలోని శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి లలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలకు ముందురోజు అంటే శ్రావణ శుద్ధ నవమి సాయంత్రం, స్వామి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు, పల్లకిపై తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయ నైరుతిదిశలోని వసంతమండపానికి చేరుకుంటారు. అక్కడే భూమిపూజ చేసి, మృత్సంగ్రహణం చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే ఆలయంలోని అంకురార్పణ మండపంలో నవధాన్యాల బీజావాపం (అంకురార్పణం) చేస్తారు. తొలిరోజు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో మలయప్పస్వామి పవిత్రోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ పవిత్రాలు సమర్పిస్తారు. పవిత్రాలు అంటే రంగురంగుల అద్దాలతో తయారుచేసిన పట్టుదండలు. యాగశాలలో ఏడు హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. వీటి మధ్య ఒక వేదికపై నవకలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించి హోమాలు నిర్వహిస్తారు. ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
రెండవరోజు మూడవరోజు కూడా తొలిరోజు మాదిరిగానే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు మొదలైన పూజా కార్యక్రమాలు చేసి పవిత్రాలను సమర్పిస్తారు.