Vijaya Lakshmi
Published on Dec 27 2023
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అది దేవలోకానికి మార్గం... పరమశివుడు కోటిమంది దేవతలతో సేదతేరిన ప్రదేశం... ఎక్కడా అంగుళం ఖాళీ లేకుండా చెక్కిన దేవతాశిల్పాలు... ఒక కొండనే కేన్వాస్ గా చేసుకొని శిల్పాలుగా మలచిన మహాద్భుతం. అన్నీ కలగలిసిన ఆ ఉనకోటీశ్వర కాలభైరవుడి ఆలయం
ఇదిగో పైన చిత్రంలో చూడండి... రాతి మీద శిల్పాలు చెక్కడం మనకు తెలిసిందే కాని ఇక్కడ కొండమీదే చెక్కిన దేవతాశిల్పాలు...చూడండి .... ఒకటి కాదు, రెండు కాదు కోటి శిల్పాలు...కొండంతా అంగుళం కూడా వదలకుండా ఉన్న ఈ శిల్పాలు ఎవరు చెక్కారు...? ఎందుకు చెక్కారు...? ఎప్పుడు చెక్కారు...?
అసలు ఈ ప్రదేశమే ఒక కీకారణ్యం. ప్రాణాలరచేత పెట్టుకొని వెళ్ళవలసిన కీకారణ్యం, అలాంటి ప్రదేశంలో మనిషన్న జాడే లేని మహారణ్యంలో అందమైన శిల్పాలు ఉండటం ఆశ్చర్యాన్ని మించిన అద్భుతమే కదా! ఆ అద్భుతమే ఉనకోటి. 'సెవెన్ సిస్టర్స్' గా ప్రసిద్ధిచెందిన, ఈశాన్య భారతదేశ ఏడు రాష్ట్రాలలో ఒకటైన త్రిపుర లో ఉంది ఉనకోటి. కొండలు, లోయలు, మైదానాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన త్రిపుర రాష్ట్రంలో ఆధ్యాత్మిక అద్భుతం ఉనకోటి.
ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థం… ఈ ఉనకోటిలో కోటి శిల్పాలు కనిపిస్తాయి.. ఈ శిల్పాల వెనకున్న పురాణ కథనం ఎలా ఉందంటే.... ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసం నుంచి కాశీ నగరానికి వెళ్ళడానికి బయలుదేరాడు. అయితే దేవతలందరూ తాము కూడా శివునితో పాటు వస్తామని వెంట పడ్డారట. శివుడు వద్దని వారించినా వినకుండా వెంటపడడంతో సరేనని దేవతలందరినీ వెంటపెట్టుకొని బయలుదేరాడు శివుడు. సరిగ్గా ఈ ప్రాంతానికి వచ్చేసరికి రాత్రయింది. అప్పటికే దేవతలందరూ అలసిపోవడంతో అక్కడే రాత్రంతా సేదతీరి సూర్యోదయం కాకముందే లేచి ప్రయాణం మొదలుపెట్టాలని చెప్పాడు శివుడు. సరేనన్నారు దేవతలు. అయితే సూర్యోదయమైనా దేవతలెవ్వరూ నిద్ర మేల్కొలేదట. దాంతో శివుడు తన మాటను ఉల్లంఘించినందుకు కోపగించుకొని అందరినీ శిలలుగా మారిపొమ్మని శపించాడని ఓ కథనం.
మరో కథనం శివభక్తుడైన ఓ శిల్పితో ముడిపడినది. పూర్వం ఈ ప్రాంతంలో కుల్లూ కుంహార్ అనే ఒక శిల్పి ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు. అతడికి తన శరీరంతో కైలాసం వెళ్లి అక్కడ ఉండాలని కోరిక కలిగింది. సరిగ్గా దేవతలతో కలిసి పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చినపుడు తన కోరికను తెలియచేసాడు. అయితే ఆ కోరిక తీరడం సాధ్యం కాదని చెప్పాడు శివుడు. కుల్లూ కుమ్హార్ తన పట్టు వీడలేదు. అతడిని ఊరడించడానికి పార్వతీదేవి ముందుకొచ్చి ఒక్క రాత్రిలో ఈ కొండ మీద కోటి దేవతలా శిల్పాలు చెక్కగలిగితే నీ కోరిక తీరుతుందని చెప్పింది. సరేనని శిల్పాలు చెక్కడంలో పడిపోయాడు. సూర్యోదయానికి ముందే కోటి శిల్పాలు చెక్కాడు. అయితే చివరి శిల్పం చెక్కే సమయానికి అతనిలో నేను ఇంత అసాధ్యమైన కార్యం చేసాను కదా అన్న అహంకారం వచ్చిందట. దాంతో ఆ చివరి శిల్పం దేవతల రూపం కాకుండా తన రూపమే వచ్చింది. దాంతో కోటి దేవతలా శిల్పాలు చేక్కాలన్న నిబంధన నెరవేరలేదు కాబట్టి అతని కోరిక తీరలేదు. అలా ఇక్కడ కోటికి ఒకటి తక్కువగా దేవతలా శిల్పాలు ఏర్పడ్డాయన్నది మరో కథనం.
ఈ పురాణ కథనాల సంగతి అలా ఉంచితే చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే వీటిని ఇంత మారుమూల అడవిలో ఎందుకు చెక్కారు. ఏ రాజు పాలనలో ఏర్పాటు చేశారు, ఎవరు చెక్కారన్న దానికి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లభించడం లేదు. అయితే సుమారుగా 7, 8 శతాబ్దాల కాలంలో చేక్కివుంటారని ఒక అంచనా
. సరే.... చారిత్రిక ఆధారాల చర్చ, పురాణ కథనాల సమీక్షలు పక్కన పెడితే పర్యాటకులకు మాత్రం ఈ ప్రదేశం స్వర్గధామమే. చుట్టూ జలపాతాలలు, పచ్చటి అడవుల మధ్య ఈ ఉన కోటి భూతల స్వర్గమే. మానవాకారంలో పెద్దజటాజూటాలతో, కిరీటాలతో దాదాపు 30 అడుగుల ఎత్తున్న శివుడి ముఖం, సింహం మీద కూర్చున్న దుర్గా మాత, , పార్వతి, భైరవుడు, గంగాదేవి, పెద్దగణేశుదు, విష్ణువు, నర్సింహస్వామి,హనుమాన్, దేవతలా వాహనాలైన వాహనాలైన సింహం, నంది,పులి ఇలా సమస్త దేవతలా విగ్రహాలు ఇక్కడ కనబడతాయి. ఈ శిల్పాలలో పదడుగుల రూపాల్నుంచి 50 అడుగుల ఎత్తైన ఆకారాల వరకు వున్నాయి. ఇందులో 30 అడుగుల ఎత్తున్న ప్రధాన విగ్రహాన్ని ‘ఉన కోటేశ్వర కాల భైరవుడు’గా చెబుతారు. పురావస్తు పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విగ్రహాలు సరిగ్గా 99,99,999 ఉన్నట్టు తేల్చారు. అందుకే ఈ ప్రాంతానికి ఉనకోటి అన్న పేరు స్థిరపడిపోయింది. స్థానిక భాషలో ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థం.
ఉనకోటిలో ఇంతమంది దేవతా మూర్తులు కొలువుతీరినా ప్రధానదైవం మాత్రం కాలభైరవుడే! చుట్టూ పచ్చని చెట్లు, గలగలా పారే జలపాతాలు, కనువిందు చేసే భారీ శిల్పాలు... విభిన్నతకు మారుపేరులా స్థానిక సంస్కృతీ, సంప్రదాయాలు ఇలా ఎటుచూసినా సహజ ప్రకృతి సౌందర్యానికి సరైన అర్థంలో నిలబడుతుంది ఉనకోటి. అందుకనే ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని కూడా సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడకు చేరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చైత్ర మాసంలో వచ్చే అశోకాష్టమి మేళా ప్రపంచ ప్రఖ్యాతి చెందింది.ఈ మేళాకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు జనవరిలో వచ్చే మకరసంక్రాంతి సందర్బాలలో ఈ ప్రాంతమంతా జాతరలా మారిపోతుంది.
ఈ ఉనకోటి ఒకప్పుడు బౌద్ధుల ప్రధాన కేంద్రంగా విరాజిల్లినట్టు పరిశోధనలు చెప్తున్నాయి.
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని అగర్తకు 170కి.మీ ల దూరంలో అటవీప్రాంతంలో వున్న ఈ క్షేత్రానికి ఎలా వెళ్లావు చూద్దాం. అగర్తలలో ఎయిర్ పోర్టు కూడా ఉంది. అగర్తల నుంచి ప్రైవేటు ట్యాక్సీలల్లో ఉనాకోటికి చేరుకోవచ్చు. ఉనాకోటికి దగ్గరగా దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ధర్మనగర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో దాదాపు అర్థగంట ప్రయాణం చేసి ఉనకోటి చేరుకోవచ్చు.