Vijaya Lakshmi
Published on Dec 28 2023
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?పండగొచ్చినా.. పబ్బమొచ్చినా... కష్టమొచ్చినా... సుఖమొచ్చినా... విశాఖవాసులు ముందుగా కొలుచుకునే ఆదిదేవుడు సంపత్ వినాయకుడు. ఒకప్పుడు వాస్తు దోష నివారణ కోసం స్థాపించిన ఆ దేవాలయం ఇప్పుడు విశాఖవాసుల కొంగుబంగారంగా విలసిల్లుతోంది. సిద్ధి, బుద్ధి వినాయకుడు, ఏకదంతుడు, లక్ష్మీగణపతిగా అందరికీ తెలిసిన వినాయకుడు సంపదలు కూడా ఇస్తానని చెప్పేందుకు వెలసిన అవతారమే సంపత్ వినాయగర్.
సంపదలొసగే ఈ సంపత్ వినాయకుడిని వాస్తు దోష నివారణ కూడా చేస్తాడని భక్తుల నమ్మకం. విశాఖపట్నం జనమేగాక అనునిత్యం చుట్టుపక్కల ప్రాంతాలనుంచి అశేషంగా భక్తజనం వచ్చి స్వామివారిని కొలుచుకుంటుంటారు. అభిషేకప్రియుడైన ఆ గజాననుడికి కోరికలు తెలియజేసుకుంటుంటారు. భక్తుల కొంగుబంగారంగా స్వామి విరాజిల్లుతున్నారు.
విశాఖలో వినాయకుని ఆలయాల్లో ప్రత్యేకత చాటుకున్న దేవాలయం శ్రీసంపత్ వినాయగర్ దేవాలయం. భక్తుల కొర్కేలు తీర్చే ప్రభువుగా ఇక్కడ గణనాధుడు ప్రసిద్ధికెక్కారు. విశాఖపట్నంలో చాలామంది ప్రజలు ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా ముందుగా సంపత్ వినాయకుని దర్శించుకొని తమ సంకల్పం చెప్పుకొని మొక్కుకుంటారు. ప్రతిరోజూ సంపత్ వినాయకుని దర్శించుకునే తమ వృత్తి వ్యాపారాలకు ముందుకెళతారు. విశాఖ నగర నడిబొడ్డున వెలసిన శ్రీసంపత్ వినాయగర్ స్వామికి పెద్ద చరిత్రే ఉంది.
దాదాపు అయిదు దశాబ్దాలుగా విశాఖవాసుల ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన ఈ సంపత్ వినాయక దేవాలయం మొదట ఒక కుటుంబంవారు స్థాపించారు. వాస్తుదోష నివారణకు గణపతిని పూజించడం, ప్రతిష్టించడం సంప్రదాయం. అదేవిధంగా 1962లో ‘మెసర్స్ ఎస్ జి సంబంధన్ అండ్ కో’ ఆవరణంలో ఎస్ జి సంబంధన్, టి ఎస్ సెల్వగణేశన్, టి.ఎస్ రాజేశ్వరన్ కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్కు సమీపంలో ఆశీలుమెట్టలో... తమకు సంబంధించిన భవనంలో వాస్తుదోష పరిహారం కోసం శ్రీ సంపత్ వినాయగర్ స్వామివారి దేవాలయాన్ని స్థాపించారు. దేవాలయం స్థాపించిన కొత్తలో అక్కడికి దగ్గరలోనే ఉన్న జాలర్లు ప్రతిరోజు స్వామిని అర్చించి, నమస్కరించి వారి వృత్తిని మొదలుపెట్టేవారట. కాలక్రమేణా స్వామిని మొక్కుకోవడం వలన తమ జీవితాల్లో జరిగిన అద్భుతాలను కథలు... కథలుగా చెప్పుకునేవారు జాలర్లు. అలా సంపత వినాయకుని మహిమ ఆ నోటా ఈ నోటా ప్రజలందరికీ చేరింది. అలా ప్రజలందరికీ సంపత్ వినాయక దేవాలయం ప్రజలకు చేరువైంది. ఆ తరువాత ఐదు సంవత్సరాలకు నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన కంచి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వహస్తాలతో ఇక్కడ ‘గణపతి యంత్రం’ స్థాపించారు. సకల విఘ్నాలను హరించి తనను కొలిచేవారికి సంపదలిచ్చే వేల్పుగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు సంపత్ వినాయగర్.
విశాఖపట్టణం నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విరాజిల్లుతున్న ఈస్వామి ఆలయం వైశాల్యంలో చాలా చిన్నదయినా కూడా వేలాదిమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ప్రతినిత్యం వివిధ ద్రవ్యాలతో ఇక్కడ స్వామికి అభిషేకాలు జరుగుతుంటాయి.
ఈ ఆలయానికి సంబంధించి చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాక్ యుద్ధనౌకలు భారత సముద్ర జలాల్లోకి చొచ్చుకు వచ్చినప్పుడు విశాఖను కాపాడాల్సిందిగా ప్రార్ధిస్తూ తూర్పు నావికాదళం ఇన్చార్జి అడ్మిరల్ కృష్ణన్ సంపత్ వినాయగర్ ఆలయంలో 1,101 కొబ్బరికాయలను స్వామివిగ్రహం ముందు కొట్టారు. ఇది జరిగిన కొద్దిరోజులకే పాకిస్తాన్ సబ్మెరైన్ పిఎన్ఎస్ ఘాజీ సముద్రజలాల్లో మన యుద్ధనౌకలపై దాడిచేసేందుకు వచ్చి బాంబులు అమర్చి తిరిగివెళ్తూ అవే బాంబులు పేలి సముద్రంలో మునిగిపోయింది. దీంతో విశాఖనగరానికి పెద్దప్రమాదం తప్పింది. ఇదంతా వినాయగర్ మహిమేనని భావించిన అడ్మిరల్ కృష్ణన్ తాను ఇక్కడ ఉన్నంతకాలం ప్రతిరోజూ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసినవారు ముందుగా తమ వాహనాలను సంపత్ వినాయగర్ ఆలయానికి తీసుకువచ్చి పూజలుచేయించిన తర్వాతనే వాటిని వినియో గిస్టారు అలా చేస్తే భవిష్యత్లో ఎటువంటి ప్రమాదాలు సంభవించవని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకం సంప్రదాయం గత 50 ఏళ్లుగా కొనసాగుతూనే వస్తోంది. ఉగాది, వినాయకచతుర్థి, పుత్రగణపయ్య వ్రతం, సంకటహర చతుర్థి, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయంలో ఎంతో విశేషంగా మహోత్సవాలు జరుగుతాయి. సంపత్ వినాయగర్ను దర్శించుకునేందుకు విశాఖపట్టణం ఆర్ టి సి కాంప్లెంక్స్ లో దిగి కాలినడకన చేరుకోవచ్చు.