ఈ నందుల్ని చూస్తె కళ్ళు తిరగాల్సిందే | ఆశ్చర్యం గొలిపే 5 అతి పెద్ద నంది విగ్రహాల రహస్యం | 5 Amazing Largest Nandi Statues in India

Vijaya Lakshmi

Published on Aug 23 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

నందీశ్వరుడు పరమశివుని వాహనము. పరమేశ్వరుని వాహనంగానే కాదు ప్రమేశ్వరుడికి ప్రధాన భక్తునిగా, ప్రధాన  సేవకుడిగా, కైలాస లోక సేనలకు అధిపతిగా ఉంటాడు. శివుని యెుక్క గణాలలో నందీశ్వరుని స్థానం అద్వితీయమైనది. నందీశ్వరుడు లేని శివాలయం ఉండదు. శివాలయంలో శివుడు ఉన్నాడు అంటే నందీశ్వరుడు ఉండి తీరాల్సిందే. అలాంటి నందీశ్వరుడు అతి పెద్ద ఆకారంలో ఉన్న ఆలయాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. అయితే అన్నిటిలోనూ అతి భారీగా ఉండే 5 నంది విగ్రహాల గురించి తెలుసుకుందాం...



1.    లేపాక్షి నంది

 5 భారీ నంది విగ్రహాలలో మొట్టమొదట చెప్పుకోవలసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా హిందూపూర్‌కు 14 కి.మీ దూరంలో లేపాక్షిలో ఉన్న నంది విగ్రహం. త్రేతాయుగం నాటి రామాయణంతో సంబంధమున్న ప్రదేశమది. అయిదు శతాబ్దాల కళా వైభవానికి ప్రతీక అయిన ఆ స్థలం పురాణకథనాలకు నిలయం. ఆ ప్రదేశంలో కళలకు కాణాచి అయిన ఓ అద్భుత ఆలయం. ఆ ఆలయం సర్వదేవతల నిలయం.



       ఎన్నో విచిత్రాలకు వింత కథలకు వేదిక. మరెన్నో రహస్యాలకు నిలయం. అమరశిల్పి జక్కన్న కళా ప్రాభవానికి మచ్చుతునక. నిజమెంతో ఖచ్చితంగా తెలియదు గాని కొన్ని విషాద కథనాలకు కూడా ఈ ఆలయం మూగ సాక్షి అని చెప్తారు. అన్నిటికంటే ముఖ్యం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటకస్థలం.  



ఇంత విలక్షణమైన ఆ ఆలయం లేపాక్షి. అటు పురాణపరంగాను, ఇటు చారిత్రాత్మకంగా కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన లేపాక్షిలో కొలువుతీరాడు అతి పెద్ద నంది.  లేపాక్షి అన్న మాట వినగానే మన కళ్ళముందు కనిపించేది అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం. ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహమే లేపాక్షి బసవయ్యగా ప్రసిద్ధి చెందారు.


youtube play button

 


దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఒక చిన్న గుట్టలాంటి ఏకరాతితో చెక్కిన విగ్రహం ఇది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటి. రిక్కించిన చెవులు, ఒక కాలు మడిచిపెట్టుకొని మరో కాలు లేవబోతూ కాళ్లను సరిచేసుకుంటున్న భంగిమలో, లేచి ఉరకడానికి సిద్ధంగా ఉన్న భంగిమలో, మెడలో అద్భుతమైన శిల్పకళతో చెక్కిన గండభేరుండ హారం, గంటలు, మువ్వల హారాలతో అందంగా వెలిగిపోతున్న ఆ నంది చూపు తిప్పుకోనివ్వని అందంతో వెలిగిపోతు, 15 అడుగులఎత్తు, 27 అడుగుల పొడవుతో శతాబ్దాల తరువాత నేటికే కూడా అదే ఠీవితో కనబడుతుంది.



ఆ అందం, హొయలు, టీవి చూసి పరవశించిపోయిన ప్రముఖ కవి అడవి బాపిరాజు లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరానా కదిలి రావయ్య’ అంటూ భావావేశంతో పలికాడు. ఇంతటి అందమైన నంది విగ్రహం భారత దేశంలో ఎక్కడా లేదని చెబుతుంటారు. లేపాక్షి చుట్టుపక్కల ఎవరి పశువుకైనా జబ్బు చేస్తే వారు ఈ నంది విగ్రహం వద్దకు వచ్చి నూనెతో దీపాన్ని వెలిగించి మొక్కుకుని వెళతారట. అలా చేస్తే పశువుల జబ్బులు నయమయి ఆరోగ్యంగా ఉంటాయని స్థానికుల నమ్మకం.


2.   బృహదీశ్వరాలయం – తంజావూరు



భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ బృహదీశ్వరాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉంది. ఈ ఆలయాన్ని చోళరాజు అయిన రాజరాజచోళుడు అత్యంత అధ్బుతంగా నిర్మించాడు. ఈ బృహదీశ్వరాలయం ఒక పెద్ద కోటలో ఉంది. ఆలయానికి ముందుభాగములో నల్ల రాతితో చెక్కిన బ్రహాండమైన నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం సుమారు 19 అడుగుల పొడవు,8 అడుగుల వెడల్పు,12 అడుగుల ఎత్తు,25 టన్నుల బరువు ఉంటుంది. అందుకే భారతదేశములోని అతిపెద్ద నంది విగ్రహాలలో మొదటిది లేపాక్షి లోని నంది అయితే రెండవ అతి పెద్ద నంది ఇదే అని చెప్పుతారు.



3.   యాగంటి:

ఇక మూడవ నంది యాగంటి బసవన్న. అడుగడుగునా అద్భుతాలకు, అణువణువునా అంతుచిక్కని రహస్యాలకు నిలవైన క్షేత్రం యాగంటి. యాగంటిలో అతి పెద్ద నంది ఉందని ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ వుంటాడని వింటుంటాం.

కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రంకె వేయడం కూడా ఒకటి అని వింటుంటాం. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అంటూ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పారనే విషయం మనం వింటూ ఉంటాం.  చుట్టూ ఎత్తైన ఎర్రమలకొండలు... ఆ కొండల మధ్యలో అపురూపమైన శివాలయం... అందులో అతి అరుదుగా కనబడే విగ్రహరూపంలో దర్శనమిచ్చే శివుడు.. కర్నూలు జిల్లాలో ఎత్తైన కొండల మధ్య పచ్చటి ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం వుంది.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వున్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం ‘యాగంటి’. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుజిల్లా, జిల్లా కేంద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లి మండలం, బనగానపల్లి నుండి 15 కీ.మీ. దూరంలో ఎర్రమల కొండల్లో వెలసిన యాగంటిలో శ్రీ ఉపమహేశ్వరస్వామి దేవస్థానం ఉంది.


youtube play button



యాగంటి క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకునేది యాగంటి బసవన్న. గర్భగుడికి ఎదురుగా ఉంటుంది ఒక పెద్ద రాతి నంది. ఓ 80, 90 సంవత్సరాలకు పూర్వం వరకు మండపంలో నాలుగుస్థంభాల మధ్య ఉన్న ఈ నందీశ్వరుని చుట్టు ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఖాళీస్థలం ఉండేదట. దాంతో అందరూ ప్రదక్షిణాలు చేసేవారట. అయితే ప్రస్తుతం మాత్రం ఈ నందీశ్వరుడు మహామండపం నాలుగుస్థంభాలను అంటుకుపోయినంతగా పెరిగిపోయాడు. దాంతో ప్రదక్షిణానికి అవకాశం లేకుండా పోయింది. దీన్నిబట్టి ఈ బసవన్న పెరుగుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.



పురావస్తుశాఖ వారు కూడ ఈ యాగంటి బసవయ్య 20 సంవత్సరాలకోసారి అంగుళం పెరుగుతున్నట్లు గుర్తించారు.  ఇలా పెరుగుతుండడంతో మండపం అడుగు భాగంలోని రాళ్లు కూడా అస్తవ్యస్తంగా కదిలిపోయినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను తెలియజేస్తూ దేవాదాయ శాఖ ఆలయ ప్రాంగణంలో బోర్డును ఏర్పాటు చేసింది.



నంది విగ్రహ పరిమాణం పెరగడానికిగల కారణాలను తెలుసుకునేందుకు దేశవిదేశీ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసారు. అయితే ఈ విషయం గురించి సైంటిస్టులు ఏం చెప్తారంటే కొన్ని రాళ్ళు పెరిగే స్వభావం కలిగి ఉంటాయని, ఇక్కడ నంది విగ్రహం తయారుచేసిన రాయి కూడా అలాంటి లక్షణం కలిగి ఉన్నదేనని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని చెబుతారు.



హేతువాదులు మాత్రం దీనికి కారణం యాగంటి బసవన్నను చెక్కిన రాయిలో కాల్షియమ్ కార్బొనేట్ అధికంగా ఉందని ఇది ద్రవాలను తాకగానే కెమికల్ రియాక్షన్ జరిగి గుల్ల బడుతుందని, దాని వల్లే అది పెరుగుతున్నట్లు అనిపిస్తుంది అని చెపుతున్నారు. కాని భక్తుల నమ్మకం మాత్రం మరోలా ఉంది. ఏదేమైనా ఇటువంటి జీవశిలను గుర్తించి నందీశ్వరునిగా మలచిన ఆ శిల్పుల ప్రతిభకు, నైపుణ్యానికి శిరసు వంచి నమస్కరించక తప్పడు.


 ఈ నందీశ్వరుని గురించి మరొక కథ కూడ ప్రచారం లో ఉంది. ఆలయ మహామండప నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న పెద్ద బండరాయిని పగులకొట్టి ముక్కలు చేయగా మరుసటి రోజుకి మళ్లీ ఆ ముక్కలన్నీ ఒకటై బండగా ఏర్పడేదట. దానితో భయపడిపోయిన పనివారు దాన్ని అలాగే వదిలేశారని, ఆ బండరాయే ఆ తరువాతి కాలంలో నందీశ్వరునిగా రూపుదాల్చిందని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈ నందీశ్వరుని గురించే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు “ యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమునందు రంకె వేసేనయా! “అని చెప్పారట.


4.   మైసూరు చాముండేశ్వరిదేవి ఆలయంలోని నంది విగ్రహం.

కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని మైసూరు ప్యాలెస్ కి కొంత దూరములో సముద్రమట్టానికి 3490 అడుగుల ఎత్తులో చాముండేశ్వరిదేవి ఆలయం ఉన్నది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. హరుని రుద్ర తాండవంలో అమ్మవారి "తలవెంట్రుకలు" ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెబుతుంది.ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. ఈ దేవాలయం ఉన్న కొండ మీదకి ఎక్కడానికి సుమారుగా 1000 మెట్లు ఉన్నాయి.



మైసూరు మహారాజులు ఈ దేవతని కులదేవతగా ఆరాధించేవారు. చాముండేశ్వరిదేవిని భక్తులు పార్వతి, శక్తి, దుర్గామాత అని అనేక రకాలుగా కొలుస్తుంటారు. ఇక్కడ అమ్మవారు దుష్టులకి భయాన్ని కలిగించే భయంకరమైన రూపంతో, భక్తులని రక్షించుటకు చల్లని తల్లిగా దర్శనమిస్తుంటారు. ఇక్కడ కొండపైకి ఎక్కే మార్గములో 16 అడుగుల ఎత్తు, 25 అడుగుల పొడవుగల ఒకే రాతితో నిర్మించిన అధ్బుతమైన నంది విగ్రహం ఉన్నది.


5. మహానంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలకు 14 కి.మీ. దూరంలో మహానంది మండలం, మహానంది వద్ద శ్రీ మహానందీశ్వరస్వామి వారి దేవస్థానం ఉంది. ఇది పురాణ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఈ గ్రామానికి అనుకోని 15 కి.మీ. దూరంలో నవనందులు ఉన్నాయి. వీటి అన్నిటిలోకి ఇక్కడ ఉన్న ఆలయం ప్రధానమైనది కావడంతో ఈ క్షేత్రానికి మహానంది అనే పేరు వచ్చింది.


ఇది ప్రముఖ శివ క్షేత్రం. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇచ్చట జలమే ఒక విశేషం. శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది క్షేత్రానికి మాత్రమె సొంతం. లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి సదా నీరు ఊరుతూనే వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది.


అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇచట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము అణగి వుంటుంది. ఇవి 5 అతి పెద్ద నంది విగ్రహాల వివరాలు.

ఇవి కూడా చూడండి


youtube play button



youtube play button


Recent Posts
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని మహా త్యాగం: ఊర్మిళా దేవి గాథ  | The Untold Sacrifice of Urmila in Ramayana
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని...
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి అద్భుత గాథ | Vizag Powerful Goddess Polamamba Story
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి...
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ  | Shocking Truth! Trishanku Swargam
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన...
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు - రహస్యాలు  | Simhachalam Temple History in Telugu
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు...
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance...