Vijaya Lakshmi
Published on Jul 05 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఎటు చూసినా ఇసుక మేటలు.. పర్యాటకులు తప్ప ఇతర మనుషులు నివాసాల జాడే లేని ఎడారి.
ఎడారిలో వివిధ రంగుల్లో కనబడే ఇసుక.
ఇలాంటి పరిస్తితుల్లో ఆ వాతావరణంలో, ఎడారిలో సుడాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రదేశంలో ఉన్నాయి ఆ అద్భుత ఆలయాలు. అద్భుతమంటే మామూలు అద్భుతం కాదు. అంతవరకూ ప్రపంచంలోనే కనీ వినీ ఎరుగని విధంగా మొట్టమొదటిసారిగా ఇంజనీర్లు ఆవిష్కరించిన నమ్మలేని నిజం ఆ అద్భుత ఆలయాలు. అవే అబూసింబల్ ఆలయాలు.
ఆలయం అన్నమాటే గాని దీని వెనకున్న ఇంజనీరింగ్ విజ్ఞానం... గురించి వింటే నమ్మలేం కాని నమ్మక తప్పదు. ఇంతకీ ఆ ఆలయాలెవరివి...? వాటి వెనకున్న విజ్ఞానమేంటి...? అసలా ఆలయాలెందుకు కట్టారు...? ఎవరు కట్టారు...?చూద్దాం...
అబూసింబల్ ఓ అద్భుత ఆవిష్కరణ. క్రీ.పూ 1250 ప్రాంతంలో ఈజిప్ట్ లో అప్పటి పాలకుడు రామ్సెస్ 2 తన విజయచిహ్నంగా ఒక కొండను తొలచి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దాన్ని అబు సింబెల్ ఆలయం అని పిలుస్తారు. అయితే 1960 ల్లో అక్కడ ఒక డాం నిర్మాణం ప్రారంభమయింది. ఆ డాం నిర్మాణం గనక జరిగితే ఈ ఆలయం... మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. మునుగుతుందని తెలుసుకొని, అనేక దేశాలు,UNO సహకారంతో ఆ కొండను,శిల్పాలను ఒక్కొక్కటిగా... విడదీసి కాస్త ఎగువ ప్రదేశంలో మళ్ళీ నిర్మించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొనే మన పురావస్తు శాఖ వారు శ్రీశైలం డ్యాం నిర్మాణ దశలో నీటిలో మునిగిపోయే ప్రమాదంలో పడిన కర్నూల్ జిల్లాలోని సంగమేశ్వర ఆలయాలనూ ఒకో రాయికి ఒక నంబర్ ను ఇచ్చి విడదీసి ఆ ఆలయాలను మరోచోట పునర్మించారని కూడా చెప్తారు. సరే ఆ విషయం అలా ఉంచితే... ప్రస్తుత టాపిక్ అబూసింబల్ ఆలయాల చరిత్ర విషయానికి వస్తే...
క్రీస్తు పూర్వం పదమూడో శతాబ్దంలో , 1279-1313 సంవత్సరాల మధ్యలో ఈజిప్ట్ ను పరిపాలించిన ఫారో రాంసేస్ 2, కాదేశ్ యుద్ధంలో గెలిచిన సందర్భంగా ఆ విజయానికి గుర్తుగా, తన రాణి నేఫార్తరితో కలిసి ఈ ఇసుక రాతి ఆలయాలని కట్టించాడట. దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టిందిట ఈ ఆలయాలు కట్టడానికి. దేవతల మధ్య తనకి కూడా స్థానం సంపాదించుకోడం, తన ఆర్దికశక్తి ని ప్రదర్శించి శత్రువులను భయపెట్టడమే ఈ ఆలయాలు కట్టడం వెనక ఉన్న రాంసేస్ రాజుకు అంతర్లీనంగా ఉన్న ఉద్దేశంగా కూడా చెప్తారు.
అబూ సింబల్ ఆలయాలు రెండు ఆలయాలు. ఒకటి పెద్ద గుడి. అదే గ్రేట్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది రాంసేస్ రాజు గుడి. ఇందులో రెండోది చిన్న గుడి. ఈ ఈజిప్షియన్ దేవతతోపాటు, దేవుడిలాగే ఉన్న రామ్సేస్ II , రాణి నేఫర్తరి ఉంటారు. ప్రవేశ ద్వారం వద్ద రామ్సేస్ II , నేపార్తరి భారీ విగ్రహాలని చెక్కారు. రామ్సేస్ II ఓడించిన రాజుల విగ్రహాలు కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి. ఆలయం లోపల చెక్కిన చిత్రాలన్నిటిలోను రాజు, రాణి గార్లు తమ దేవతలకి అర్పించిన కానుకలని చిత్రాల రూపంలో చూడచ్చు. ఇక రెండవది చిన్న గుడి. ఇది రాణి నేఫర్తరికి ఉద్దేశించిన గుడి.
సంవత్సరం లో రెండు రోజులు – అంటే రామ్సెస్ 2 పుట్టినరోజు, పట్టాభిషేకం రోజులయిన అక్టోబర్ 22 - ఫిబ్రవరి 22 నాడు మొట్టమొదటి సూర్య కిరణాలు ఆలయం లోకి ప్రవేశించి అక్కడ ఉన్న దేవతలతో పాటు, రామ్సేస్ -II , విగ్రహాల మీద పడేవిధంగా ప్రకాశింపచేస్తాయి. ఈ వింతని చూడడానికి ఒక రోజు ముందు నుండే యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు.
ఇక ఈ ఆలయాల గురించి ప్రధానంగా చెప్పుకోవలసిన విషయం ఈ ఆలయాలు రెండవ రాంసేస్ కట్టిన ప్రదేశం నుంచి ఉన్నవి ఉన్నట్టుగా మరో ప్రదేశానికి తరలించడం. అసలు అలా చేయడం సాధ్యమేనా... సాధ్యమే అని నిరూపించారు పోలిష్ పురావస్తు శాస్త్రవేత్త కాజిమిర్జ్ ఆధ్వర్యంలోని
ఇంజనీరింగ్ నిపుణులు. నైల్ నది మీద ఆస్వాన్ డ్యాం నిర్మాణం సంకల్పించినపుడు ఈ ఆలయాలున్న ప్రాంతం నీట మునిగే ప్రమాదం ఏర్పడింది. దాంతో ఈ అద్భుత ఆలయాలు ఎలాగైనా రక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈజిప్ట్ ప్రభుత్వం, యునెస్కో కలిసి వాటిని ఆ ప్రాంతం నుంచి తరలించి మరో సురక్షిత ప్రాంతంలో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాయి. 1960 లో అప్పటి ఇంజనీర్లు ఆలయంలోని ఒకో భాగాన్ని పెద్ద పెద్ద క్రేన్ లతో ఎత్తి వాటిని తరలించి 60 మీటర్ల ఎత్తులో కృత్రిమంగా నిర్మించిన ఇసుకరాతి గుట్ట మీద పురర్నిర్మించారు.
ప్రస్తుతం ఈ అబూ సింబల్ ఆలయాలు ప్రపంచ వారసత్వ సంపదగా పరిగణించబడుతున్నాయి. ఆలయంలోని దేవతలు, శిల్పసంపద ఇలాంటి వాటి సంగతెలా ఉన్నా ఒక ఆలయాన్ని లేదా కట్టడాన్ని ఉన్న చోటి నుంచి భాగాలుగా చేసి తరలించడం అద్భుతమే కదా... ఇవి ఈజిప్ట్ అబూ సింబల్ అద్భుత ఆలయాల విశేషాలు.