Vijaya Lakshmi
Published on Jun 06 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?నరసింహ స్వామి! ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ ఉగ్రరూపమే! స్తంభం నుంచి ఒక్కసారిగా ఆవిర్భవించి, హిరణ్యకశిపుడిని తన వాడి గోళ్లతో చీల్చి చెండాడిన మహాద్భుత ఘట్టం. భయంకరమైన సింహం తల, మానవ శరీరం, నిప్పులు కక్కే కళ్ళు, ప్రళయాన్ని తలపించే గర్జన... ఆ రూపాన్ని ఊహించుకుంటే ఒకేసారి భక్తి, భయం రెండూ కలుగుతాయి. మనలో చాలామంది, నరసింహ స్వామి అంతటి ఉగ్రరూపం దాల్చడానికి కారణం హిరణ్యకశిపుడి పాపాలే, తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడాలనే ఆరాటమే అని అనుకుంటాం.
కానీ... అసలు కథలో ఇంకొన్ని మలుపులున్నాయని మీకు తెలుసా? నరసింహుడి ఆ భయంకర రూపం వెనుక ఒక ఘోరమైన శాపం ఉందని, ఆ శాపమే హిరణ్యకశిపుడి చావుకు కారణమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈ శాపానికి, నరసింహావతారానికి ముడిపడి మనకు తెలియని ఎన్నో రహస్యాలు పురాణాల్లో, పుణ్యక్షేత్రాల కథల్లో దాగి ఉన్నాయి. ఈ రోజు మనం ఆ రహస్యాల పొరలు విప్పుతూ, నరసింహ స్వామి ఉగ్రరూపం వెనుక ఉన్న ఆ 5 మహా రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. పదండి,
అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? సాక్షాత్తూ వైకుంఠంలో! శ్రీమహావిష్ణువు ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు ఆయనకు అత్యంత ప్రియమైన భక్తులు, గొప్ప శక్తిమంతులు. ఒకనాడు బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు మహర్షులు విష్ణు దర్శనానికి వైకుంఠానికి వచ్చారు. ఈ సనక సనందనాదులు ఎప్పుడూ ఐదేళ్ల బాలుర రూపంలోనే ఉంటారు. వాళ్లని చూసిన జయ విజయులు, చిన్న పిల్లలు అనుకుని అహంకారంతో లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
భగవంతుడికి, భక్తుడికి అడ్డుగా నిలబడటం మహా పాపం కదా. దీంతో మహర్షుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "భగవంతుని దగ్గర ఉండి కూడా మీలో ఈ రాక్షస గుణం ఏంటి? మీరు ఇక్కడ ఉండే అర్హత లేదు. భూలోకంలో రాక్షసులుగా పుట్టండి" అని ఘోరంగా శపించారు. ఆ శాపానికి జయ విజయులు వణికిపోయి, మహర్షుల కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన విష్ణుమూర్తి, తన భక్తులైన మహర్షుల శాపాన్ని గౌరవిస్తూ, జయ విజయులకు ఒక అవకాశం ఇచ్చాడు. "మీరు ఏడు జన్మల పాటు నా భక్తులుగా భూమ్మీద పుడతారా, లేక మూడు జన్మల పాటు నా పరమ శత్రువులుగా పుట్టి, నా చేతిలోనే చనిపోయి తిరిగి వైకుంఠానికి వస్తారా?" అని అడిగాడు. తమ స్వామికి ఏడు జన్మలు దూరంగా ఉండలేమనే బాధతో, జయ విజయులు స్వామీ ఏడుజన్మల పాటు నీకు దూరంగా ఉండలేం. అందుకే మూడు జన్మల శత్రుత్వాన్నే ఇవ్వు. శత్రుత్వం తోనైనా నిన్ను త్వరగా చేసుకుంటాం అన్నారు. ఆ శాపమే విష్ణుమూర్తి అవతారాలకు పునాది వేసింది. అలా జయవిజయుల మూడు జన్మలలో మొదటి జన్మే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఇప్పుడు ఈ శాపానికి, నరసింహావతారానికి ముడిపడి ఉన్న ఆ 5 రహస్యాలను ఒక్కొక్కటిగా చూద్దాం.
మనం సాధారణంగా శాపం అంటే శిక్ష అనుకుంటాం. కానీ జయ విజయులు పొందిన శాపం, వాళ్ళకి శాపమైనా ఈ లోకానికే ఒక వరంగా మారింది. ఇదే మొదటి రహస్యం. ఎలా అంటారా? జయ విజయులు కేవలం వైకుంఠ ద్వారపాలకులు. వాళ్ల కథ అక్కడికే పరిమితమయ్యేది. కానీ మహర్షుల శాపం వల్ల, వాళ్లు భూమ్మీద అత్యంత శక్తివంతమైన రాక్షసులుగా పుట్టారు. వారిని అంతమొందించడం కోసమే సాక్షాత్తూ మహావిష్ణువు వరాహ, నరసింహ, రామ, కృష్ణ అవతారాలుగా భూమిపైకి రావాల్సి వచ్చింది.
ఒకవేళ ఈ శాపం లేకపోతే, హిరణ్యకశిపుడు లేడు. ప్రహ్లాదుడి అచంచల భక్తి కథ మనకు తెలిసేది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా, ధర్మాన్ని కాపాడటానికి, భక్తుడిని ఆదుకోవడానికి భగవంతుడు ఎలాంటి రూపమైనా ఎత్తుతాడు అని చెప్పే అద్భుతమైన నరసింహావతారమే లేదు. జయ విజయుల కథ మనకు నేర్పేది ఒక్కటే. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు శాపాల్లా కనిపించినా, వాటి వెనుక దేవుడి లీలలో ఒక గొప్ప ప్రణాళిక దాగి ఉంటుంది. ఆ శాపం ద్వారపాలకులను దేవుడి శత్రువులుగా మార్చింది, కానీ అదే శాపం దేవుడిని అవతారమూర్తిగా భూమిపైకి తీసుకువచ్చి లోకకల్యాణం చేసింది. అందుకే ఇది శిక్ష రూపంలో ఉన్న వరం.
ఇక రెండవ రహస్యం ... అంతర్వేది నరసింహస్వామి, రక్తకుల్య నది రహస్యం. నరసింహుడిది కేవలం గుడ్డిగా సంహరించే ఉగ్రరూపం కాదు. ఆయన ప్రతి చర్య వెనుక ఒక అద్భుతమైన దైవ ప్రణాళిక, ఉంది. దీనికి సాక్ష్యమే అంతర్వేది క్షేత్రంలోని "రక్తకుల్య రహస్యం". అంతర్వేది, ప్రసిద్ధి చెందిన నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ వశిష్ఠ మహర్షి కోరిక మేరకు స్వామి లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు.
స్థల పురాణం ప్రకారం, బ్రహ్మదేవుడు ఒకసారి ఇక్కడ యాగం చేస్తుండగా, దాన్ని నాశనం చేయడానికి రక్తావలోచనుడు అనే రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడికి శివుడిచ్చిన ఒక విచిత్రమైన వరం ఉంది. అతని శరీరం నుండి ఒక్క రక్తపు చుక్క నేల మీద పడితే, దాని నుండి వేలకొద్దీ రాక్షసులు పుట్టుకొస్తారు. ఇది హిరణ్యకశిపుడి వరాల కన్నా ప్రమాదకరమైనది. అలాంటి విలక్షణమైన వారాలున్న ఆ రాక్షసుడిని చంపడం ఎలా?
అప్పుడే నరహరి తన ఉగ్రరూపంతో పాటు, అద్భుతమైన మాయాశక్తిని చూపించాడు. ఆయన ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తూ, తన సుదర్శన చక్రంతో వధించాడు. అయితే, అతని రక్తం ఒక్క చుక్క కూడా నేలపై పడకుండా, తన మాయతో "రక్తకుల్య" అనే ఒక నదిని సృష్టించి, ఆ రక్తాన్నంతా అందులోకి ప్రవహించేలా చేశాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడిని సులభంగా సంహరించాడు. ఈ రక్తకుల్య నది ఇప్పటికీ అంతర్వేదికి సమీపంలో ఉందని, అందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఈ రహస్యం మనకు చెప్పేది ఏంటంటే, నరసింహుని ఉగ్రత విధ్వంసానికి కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి వాడే ఒక తెలివైన ఆయుధం.
ఇక మూడవ రహస్యం మట్టపల్లి గుహ, ఋషుల సేవ. నరసింహ స్వామి ఎంత ఉగ్రరూపంలో ఉన్నా, ఆయన పరమ పూజనీయుడు. దేవతలే కాదు, గొప్ప గొప్ప ఋషులు కూడా ఆయన్ను ఆరాధిస్తారు. ఈ రహస్యానికి సజీవ సాక్ష్యం తెలంగాణలోని మట్టపల్లి క్షేత్రం. కృష్ణా నది ఒడ్డున, ఒక గుహలో వెలసిన ఈ యోగానంద లక్ష్మీనరసింహ స్వామితో ఎన్నో రహస్యాలు ముడిపడి ఉన్నాయి.
స్థల పురాణం ప్రకారం, ఈ గుహలో స్వామి స్వయంభువుగా వెలిశాడు. మనుషులకు ఈ ప్రదేశం గురించి తెలియకముందు, భరద్వాజ మహర్షి లాంటి ఎందరో ఋషులు ప్రతిరోజూ సూక్ష్మరూపంలో ఇక్కడికి వచ్చి స్వామిని సేవించేవారట. ఇప్పటికీ, ఆలయం మూసివేసిన తర్వాత, రాత్రిపూట మహర్షులు ఆ గుహలోని ఒక రహస్య మార్గం ద్వారా వచ్చి స్వామికి పూజలు చేస్తారని భక్తులు గట్టిగా నమ్ముతారు. గర్భగుడిలో ఒక పక్క ఈ రహస్య గుహకు దారి ఉందని చెబుతారు. ఈ రహస్యం మనకు ఏం చెబుతోంది? నరసింహుడి రూపం భయంకరంగా ఉన్నా, ఆయన తత్వం జ్ఞానానికి, యోగానికి ప్రతీక. అందుకే గొప్ప జ్ఞానులైన ఋషులు సైతం ఆయన ఉగ్రరూపం వెనుక ఉన్న యోగానంద స్వరూపాన్ని చూసి, నిత్యం ఆరాధిస్తారు.
నాలుగవ రహస్యం కోతి రూపంలో స్వామి ఇచ్చే స్వప్న సందేశాలు. భగవంతుడు తన భక్తులను కాపాడటానికి ఏ రూపంలోనైనా వస్తాడు. కొన్నిసార్లు మనం ఊహించని విచిత్ర రూపాల్లో కూడా కనిపిస్తాడు. అలాంటి ఒక వింతైన, అద్భుతమైన రహస్యమే మట్టపల్లి క్షేత్రంలో ప్రచారంలో ఉన్న "కోతి రూప రహస్యం". ఈ క్షేత్రంలో దీర్ఘకాలిక అనారోగ్యాలతో, గ్రహ దోషాలతో బాధపడే భక్తులు స్వామిని సేవించి, ఇక్కడే నిద్రిస్తారు.
స్థానిక నమ్మకాల ప్రకారం, స్వామి వారు కలలో ఒక కోతి రూపంలో కనిపిస్తాడట. ఆ కోతి కలలో భక్తుడిని పిడిగుద్దులతో బాదుతున్నట్లు, ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తుంది. భక్తులు ఉలిక్కిపడి లేచేసరికి ఒంటి మీద నొప్పులుగా కూడా ఉంటుందట. కానీ, ఆశ్చర్యంగా ఆ దెబ్బల తర్వాత వారికున్న గ్రహ దోషాలు, అనారోగ్యాలు పూర్తిగా తొలగిపోతాయని ఎందరో భక్తులు అనుభవపూర్వకంగా చెబుతారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇది ఆ క్షేత్ర మహాత్మ్యంగా భక్తులు నమ్ముతారు. ఇదే క్షేత్రంలో, అనుముల మాచిరెడ్డి అనే భక్తుడికి స్వామి కలలో కనిపించి, తాను గుహలో ఉన్నానని చెప్పి తన ఆనవాళ్లు తెలిపాడని చరిత్ర చెబుతోంది. ఈ రహస్యం ద్వారా స్వామి మనకు ఏం సందేశం ఇస్తున్నాడు? ఆయన శిక్షించేది మనల్ని కాదు, మనల్ని పట్టి పీడిస్తున్న కర్మను, దోషాలను అని. ఆయన ఉగ్రతలో కూడా కరుణ దాగి ఉంది. భక్తుడిని కాపాడటానికి ఆయన ఏ రూపమైనా ధరిస్తాడు, అది ఉగ్ర సింహ రూపమైనా, సామాన్య వానర రూపమైనా.
ఇక 5 వ రహస్యం ప్రహ్లాదుడు స్వయంగా కట్టాడని చెప్పే పాకిస్థాన్లోని ముల్తాన్లో ఉన్న ఆలయం.
ప్రహ్లాదుడు... నరసింహావతారానికి మూల కారణం. తన భక్తుడి కోసం స్తంభం నుండి వచ్చిన స్వామి, ఆ భక్తుడి చేత ఎన్నో చోట్ల ప్రతిష్టించబడ్డాడు. అయితే, ప్రహ్లాదుడు స్వయంగా నిర్మించిన ఒక ఆలయం పాకిస్థాన్లోని ముల్తాన్లో ఉందని, దానిని ప్రహ్లాదపురి ఆలయం అని పిలుస్తారని చెబుతారు.
ఈ ఆలయం గురించిన సమాచారం పురాణాల కన్నా స్థానిక చరిత్రలో ఎక్కువగా వినిపిస్తుంది. హిరణ్యకశిపుని వధ జరిగిన సందర్భంలోనే ప్రహ్లాదుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. అయితే, కాలక్రమేణా ఈ ఆలయం ఎన్నో దాడులకు గురై శిథిలమైంది. 1992లో జరిగిన దాడుల్లో ఇది పూర్తిగా ధ్వంసమైంది. ఈ రహస్యం మనకు ఏం చెబుతుందంటే, భగవంతుని లీలలు దేశకాలాలకు అతీతమైనవి. ప్రహ్లాదుడి భక్తికి నిలువుటద్దంగా నిలిచిన ఆ ఆలయం భౌతికంగా ఇప్పుడు లేకపోయినా, అతని భక్తి కథ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. నరసింహుని దర్శనం అనేది కేవలం కంటితో చూసేది కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఆ అనుభూతిని పొందాలంటే ప్రహ్లాదుడిలాంటి అచంచలమైన భక్తి, విశ్వాసం ఉండాలి.
మనం ఈ రోజు తెలుసుకున్న ఈ ఐదు రహస్యాలు మనకు చెప్పేది ఒక్కటే. నరసింహుడి ఉగ్రరూపం కేవలం హిరణ్యకశిపుడిని సంహరించడానికి మాత్రమే కాదు. అది ఒక శాపాన్ని నెరవేర్చడానికి, ఒక భక్తుడిని కాపాడటానికి, లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఎత్తిన ఒక దివ్యమైన రూపం. ఆ ఉగ్రత వెనుక అపారమైన తెలివి, అనంతమైన కరుణ, యోగశక్తి, భక్త వాత్సల్యం దాగి ఉన్నాయి. జయ విజయులకు ఇచ్చిన శాపం నుండి, అంతర్వేదిలో చూపిన మాయ వరకు, మట్టపల్లిలో భక్తులకు ఇచ్చిన స్వప్న దర్శనం వరకు ప్రతిదీ ఆయన లీలలో భాగమే. ఆయన సగం మనిషి, సగం సింహం రూపం కూడా "మనిషితో గానీ, జంతువుతో గానీ చావు ఉండకూడదు" అని హిరణ్యకశిపుడు పొందిన వరానికి దేవుడిచ్చిన సమాధానం.
హిరణ్యకశిపుడి అధర్మాన్ని అంతం చేయడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని ఎత్తాడు. అయితే పురాణాల ప్రకారం జయ-విజయుల శాపం కూడా ఈ అవతారానికి ఒక ప్రధాన కారణంగా చెప్పబడుతుంది.
జయ, విజయులు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు. సనక సనందనాది మహర్షులను అడ్డుకోవడం వల్ల శాపం పొంది భూమిపై రాక్షసులుగా జన్మించారు.
మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు; రెండవ జన్మలో రావణుడు, కుంభకర్ణుడు; మూడవ జన్మలో శిశుపాలుడు, దంతవక్రుడిగా జన్మించారు.
హిరణ్యకశిపుడు పొందిన వరాలను భంగపరచకుండా అతన్ని సంహరించడానికి శ్రీమహావిష్ణువు సగం మనిషి, సగం సింహం రూపంలో అవతరించాడు. ఇది విష్ణువు దశావతారాల్లో అత్యంత విశిష్టమైన అవతారంగా భావించబడుతుంది.
స్థల పురాణం ప్రకారం రక్తావలోచనుడు అనే రాక్షసుడి రక్తం నేలపై పడకుండా నరసింహ స్వామి రక్తకుల్య అనే ప్రవాహాన్ని సృష్టించి ఆ రక్తాన్ని అందులోకి మళ్లించాడని చెబుతారు.
కృష్ణా నది తీరంలోని ఈ క్షేత్రం స్వయంభూ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహర్షులు ఇప్పటికీ సూక్ష్మరూపంలో పూజలు చేస్తారని స్థానిక విశ్వాసం.
స్థానిక భక్తుల నమ్మకం ప్రకారం, కొన్ని సందర్భాల్లో స్వామి కోతి రూపంలో కలలో కనిపించి భక్తుల దోషాలను తొలగిస్తాడని చెబుతారు. ఇది క్షేత్ర మహిమగా భావించబడుతుంది.
ప్రహ్లాదపురి ఆలయం ప్రస్తుతం పాకిస్థాన్లోని ముల్తాన్ ప్రాంతంలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ ఆలయాన్ని ప్రహ్లాదుడు నిర్మించాడని స్థానిక కథనాలు చెబుతాయి.
భక్తుల నమ్మకం ప్రకారం నరసింహ స్వామి భయం, శత్రు బాధలు, గ్రహ దోషాలు, ప్రతికూల శక్తుల నుండి రక్షణ ప్రసాదిస్తాడు.
ప్రసిద్ధ నరసింహ మంత్రం:
"ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్ ।
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహమ్ ॥"
వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నరసింహ జయంతిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
ధర్మాన్ని రక్షించడం, భక్తులను కాపాడటం, అధర్మాన్ని శిక్షించడం కోసం భగవంతుడు ఎలాంటి రూపమైనా ధరించగలడనే సందేశాన్ని నరసింహ అవతారం తెలియజేస్తుంది.